సూపర్ స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. పద్మాలయ స్టూడియోలో ఆయన భౌతికకాయం అభిమానుల సందర్శనార్థం ఉంచారు. వేలాది మంది తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. బుధవారం సాయంత్రం మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. పద్మాలయ స్టూడియో కృష్ణ పార్థివదేహానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. మహేష్ బాబు, నమ్రతా, ఎంపీ గల్లా జయదేవ్, కృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మహేష్ బాబును జగన్ ఓదార్చారు. ఈ సందర్భంలో నందమూరి బాలకృష్ణ కూడా అక్కడే ఉన్నారు. కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు కుటుంబ సభ్యులను పరిచయం చేసే సమయంలో బాలయ్య వెనుక నిల్చున్నారు. బాలకృష్ణను చూసిన సీఎం జగన్ వెంటనే నమస్కారం పెట్టారు. బాలయ్య కూడా తిరిగి నమస్కారం పెట్టారు. అందరితో మాట్లాడిన సీఎం జగన్.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.